- తల్లికి వందనం: ఆ విద్యార్థులకు మరో అవకాశం..
- విద్యార్థులకు గుడ్ న్యూస్.. తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు
- తొలి విడత డబ్బులు రాని వారికి గుడ్ న్యూస్.. ఆగస్టు 30న డబ్బులు
Thalliki Vandanam Scheme : పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏడాది రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే ఈ పథకం కింద.. ఈ ఏడాది తొలి విడత నిధులను ఇప్పటికే ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
అయితే ఆధార్ బ్యాంక్ ఖాతాతో లింక్ కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలు, వివరాల్లో సమస్యలు ఉండటం వంటి కారణాలతో కొంతమంది అర్హులైన విద్యార్థులకు తొలి విడతలో డబ్బులు అందలేదు. మరోవైపు.. ఈ ఏడాది కొత్తగా పాఠశాలల్లో చేరిన కొంతమంది విద్యార్థులకు కూడా తల్లికి వందనం సాయం అందలేదు. ఇలాంటి విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
తొలి విడతలో డబ్బులు రాని విద్యార్థులకు మరో ఛాన్స్
తొలి విడతలో అర్హత ఉన్నప్పటికీ ఆర్థిక సాయం అందని విద్యార్థులను గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాలను సామాజిక తనిఖీ కోసం గత నెల 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాలు, గ్రామ, వార్డు స్థాయిలో అందుబాటులో ఉంచింది.
ఈ జాబితాలో తమ పేరు ఉన్న విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు.. తమకు అర్హత ఉన్నప్పటికీ తల్లికి వందనం డబ్బులు అందలేదని భావిస్తే, అందుకు సంబంధించిన ఆధారాలతో అభ్యంతరాలను సమర్పించే అవకాశం కల్పించారు. వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిశీలించి, అర్హతను నిర్ధారించిన తర్వాత రెండో విడతలో నిధులను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఇందుకోసం ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తులు, అభ్యంతరాలను స్వీకరించింది. ఈ ప్రక్రియలో మొత్తం 4,470 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ దరఖాస్తుల్లోని విద్యార్థుల అర్హతలను అధికారులు మరోసారి పరిశీలించనున్నారు.
ఆగస్టు 30న అర్హుల జాబితా.. తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు
అర్హతలను మరోసారి పరిశీలించిన అనంతరం ఈ నెల 30వ తేదీన ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అర్హులైన విద్యార్థుల జాబితాలను అధికారులు విడుదల చేయనున్నారు. అదే సమయంలో తొలి విడతలో తల్లికి వందనం సాయం పొందలేకపోయిన అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13,000 జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అంటే.. తొలి విడతలో డబ్బులు రాకపోయినంత మాత్రాన అర్హత కోల్పోయినట్లు కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అర్హతలు ఉండి, సరైన ఆధారాలతో అభ్యంతరాలు సమర్పించిన విద్యార్థుల వివరాలను పరిశీలించిన తర్వాత రెండో విడతలో సాయం అందించే ప్రక్రియ కొనసాగనుంది.
Thalliki Vandanam : ‘తల్లికి వందనం’ పథకానికి ఎవరు అర్హులు?
తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలంటే విద్యార్థి కుటుంబం ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. అవి:
- విద్యార్థి కుటుంబానికి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
- కుటుంబానికి 10 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు.
- కుటుంబంలోని ఎవరి పేరుపైనా ఫోర్ వీలర్ అంటే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.
- కుటుంబ విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లకు మించకూడదు.
- పట్టణ ప్రాంతాల్లో కుటుంబానికి 1,000 చదరపు అడుగులకు పైగా ఇల్లు లేదా స్థలం ఉండకూడదు.
- కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను (ఇన్కమ్ ట్యాక్స్) చెల్లించే వారైతే ఈ పథకానికి అనర్హులు.
కాబట్టి తల్లికి వందనం పథకం కింద సాయం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు తమ కుటుంబ అర్హతలను మరోసారి పరిశీలించుకోవడం మంచిది. తొలి విడతలో డబ్బులు రాకపోయిన వారు, ప్రభుత్వం ప్రకటించే ఆగస్టు 30 అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించాల్సి ఉంటుంది.













