- తెలంగాణ జొన్న రైతులకు శుభవార్త..
- 1.01 లక్షల ఖాతాల్లో రూ.994 కోట్లు జమ
- ఎరువుల పంపిణీలో కీలక మార్పులు
Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. జొన్నలు విక్రయించిన రైతుల కోసం ఎదురుచూస్తున్న చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం1.01 లక్షల మంది జొన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.994 కోట్లను నేరుగా జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ భారీ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానంలో రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల (Telangana Farmers) నుంచి జొన్నలను సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ కొనుగోలు ప్రక్రియలో భాగంగా మద్దతు ధర (MSP) ప్రకారం.. జొన్నలను విక్రయించిన రైతులకు ఇప్పుడు బకాయిలను పూర్తిగా విడుదల చేసింది. రైతు పండించిన ప్రతి గింజకు సరైన ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది.
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో అమలు చేస్తున్న జొన్న కొనుగోలు విధానం దేశానికి ఆదర్శంగా నిలిచేలా రూపొందించామని పేర్కొంది. రైతులు పండించిన పంటను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందనే భరోసా కల్పించడంతో జొన్న రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చెల్లింపులు నేరుగా ఖాతాల్లో జమ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎరువుల కొనుగోలులో ఆధార్ తప్పనిసరి.. :
వ్యవసాయ రంగంలో పారదర్శకత పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల విక్రయాలకు సంబంధించి అమలులో ఉన్నఫెర్టిలైజర్ ఫీల్డ్ స్టాఫ్ (FFS) వ్యవస్థను రాష్ట్రంలోని మరో 10 జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని నేటి నుంచి అదనపు జిల్లాల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ వ్యవస్థ ద్వారా రైతులు ఆధార్ ధృవీకరణతో ఎరువులు కొనుగోలు చేయగలుగుతారు. దీని వల్ల ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ను సమర్థవంతంగా అరికట్టవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఎంత ఎరువుల నిల్వ ఉందనే సమాచారం కూడా రియల్ టైమ్లో అందుబాటులో ఉండటంతో పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఆయిల్ ఫామ్, డ్రిప్ సాగుపై ప్రత్యేక దృష్టి :
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు అవసరమైన ఆయిల్ ఫామ్ మొక్కలను ఆలస్యం లేకుండా వెంటనే అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
అలాగే ఆయిల్ ఫామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, ఈ పంట సాగు కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులకు చేరవేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను మంత్రి కోరారు.
ఇదే సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆదేశించారు. నీటి వినియోగాన్ని తగ్గిస్తూ అధిక దిగుబడులు సాధించే డ్రిప్ సాగు విధానాన్ని మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యువ ఆవిష్కర్తలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందిస్తామని కూడా మంత్రి ప్రకటించారు.
రాష్ట్రంలో ఎరువుల పంపిణీని వేగవంతంగా, పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రైతులు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఈ యాప్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినట్లు వెల్లడిస్తూ, సాంకేతికతను వ్యవసాయ రంగంలో మరింత విస్తృతంగా వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.













