- హైదరాబాద్-విజయవాడ, ఖమ్మం రూట్లలో బస్సు టికెట్ రేట్లు ఎంతంటే?
- ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వారికి అలర్ట్.. కొత్త ఛార్జీలు ఇవే
- GO Ms. No. 16 ప్రకారం బస్సు ఛార్జీల సవరణ.. కారణం ఇదే
- పండుగ సీజన్లో భారీగా పెరిగిన TGSRTC స్పెషల్ బస్ ఛార్జీలు
Bus Ticket Prices : పండుగ సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ నుంచి ఊహించని షాక్ తగిలింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని నడుపుతున్న ప్రత్యేక బస్సు సర్వీసుల్లో ఛార్జీలను ఏకంగా 50 శాతం వరకు పెంచుతున్నట్టు TGSRTC ప్రకటించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం, కరీంనగర్, సత్తుపల్లి వంటి కీలక రూట్లలో నడిచే స్పెషల్ బస్సుల్లో ఈ పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి.
డీలక్స్, సూపర్లగ్జరీ, రాజధాని కేటగిరీల్లోని ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో సర్వీసును బట్టి ఈ అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. పండుగల సందర్భంగా ప్రయాణికుల తాకిడి పెరగడంతో, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఇప్పటికే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీటి ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఛార్జీల పెంపుకు వెనుక కారణం ఇదే
2003లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (GO Ms. No. 16) ఆధారంగానే ఈ ఛార్జీల సవరణ చేపట్టినట్టు ఆర్టీసీ వివరణ ఇచ్చింది. పండుగ సమయాల్లో నడిపే ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీల కంటే గరిష్టంగా 50 శాతం వరకు అదనపు రుసుము వసూలు చేసే వెసులుబాటు ఈ జీవోలో ఉందని సంస్థ పేర్కొంది.
Read Also : Chicken Prices : నాన్ వెజ్ ప్రియులకు పండగే.. చికెన్ ధరలు భారీగా డౌన్.. కిలో ఎంతకు అమ్ముతున్నారంటే?
ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చిన తర్వాత బస్సులు ఖాళీగా వెనక్కి రావాల్సి రావడంతో ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయని, ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ వివరించింది.
రూట్ల వారీగా పెరిగిన ఛార్జీలు
తాజాగా సవరించిన ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్ నుంచి విజయవాడకు సూపర్ లగ్జరీ బస్సు రెగ్యులర్ ఛార్జీ రూ.440 ఉండగా, ఇప్పుడు రూ.660కు పెరిగింది. అదే రూట్లో రాజధాని ఏసీ బస్సు ఛార్జీ రూ.533 నుంచి రూ.801కు చేరింది.
హైదరాబాద్-ఖమ్మం సూపర్ లగ్జరీ బస్సు ఛార్జీ రూ.320 నుంచి రూ.480కు పెరగగా, హైదరాబాద్-సత్తుపల్లి రూట్లో రాజధాని బస్సు ఛార్జీ రూ.550 నుంచి రూ.826కు, సూపర్ లగ్జరీ ఛార్జీ రూ.459 నుంచి రూ.679కు చేరుకుంది. హైదరాబాద్-కరీంనగర్ రూట్లో సూపర్ లగ్జరీ బస్సు ఛార్జీ రూ.260 నుంచి రూ.389కు పెరిగింది.
అయితే ఈ అదనపు ఛార్జీలు కేవలం పండుగ ప్రత్యేక సర్వీసులకే పరిమితమని, సాధారణ రోజుల్లో నడిచే బస్సుల ధరలు యథాతథంగా కొనసాగుతాయని ఆర్టీసీ స్పష్టం చేసింది. పండుగ సీజన్ ముగిసిన తర్వాత ఛార్జీలు మళ్లీ మామూలు స్థాయికి వచ్చే అవకాశం ఉందని, ప్రయాణికులు ఇందుకు సహకరించాలని సంస్థ కోరింది.













