- కొడుకు లేని లోటును తీర్చిన నలుగురు కూతుళ్లు
- ఊరి జనమంతా తీవ్ర భావోద్వేగం
- కడదాకా పాడె మోస్తూ తండ్రి రుణాన్ని తీర్చుకున్నారు
- ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురంలో ఘటన
Heart-Touching Scene : పేరుకే కూతుళ్లు.. కానీ, కొడుకు చేయాల్సిన అంతిమ సంస్కారాలు ముందుండి నడిపించారు. ఈ నలుగురు కూతుళ్లు తమ తండ్రి పాడెను మోస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో జరిగింది.
నరసాపురం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త గంధం సుబ్రహ్మణ్యేశ్వరరావు (75) అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత శనివారమే ఆయన ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.
తండ్రికి ఆ గ్రామంలో మంచి పేరు ఉంది. ఎలాంటి సాయం అడిగినా అన్ని తానై ముందుండి నడిపించేవారు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా అందరి మధ్య నుంచి వెళ్లిపోవడంతో ఆ ఊరు శోకసంద్రంలో మునిగిపోయింది.
ఆయనకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు లేని లోటును తీర్చేందుకు ఆయన చివరి కర్తవ్యాన్ని నిర్వహించారు. నలుగురు కూతుళ్లు ముందుకు వచ్చి తండ్రె పాడెను స్వయంగా భుజాలపై మోస్తూ తీసుకెళ్లారు.
Heart-Touching Scene : తండ్రి అంతిమ సంస్కారాలు చేసిన కూతుళ్లు :
తండ్రి పాడెను మోస్తున్న నలుగురు కూతుళ్లను చూసిన ఆ ఊరి జనమంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఊరు ఊరు మొత్తం కన్నీటితో సాగనంపారు. తండ్రి అంతిమ సంస్కారాలను కుమారుల్లాగే పూర్తి చేశారు. తమకు తండ్రి పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతను గుర్తు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు.
సాధారణంగా ఆడపిల్లలు కుటుంబానికి భారంగా భావిస్తుంటారు. కానీ, అదే కుటుంబానికి ఈ నలుగురు ఆడపిల్లలు అండగా నిలిచారు. కొడుకు లేడనే లోటును తీర్చడమే కాకుండా కనిపెంచిన తండ్రికి తమ వంతు బాధ్యతగా కడదాకా పాడె మోస్తూ తమ తండ్రి రుణాన్ని తీర్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.















