- పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు, వరద ముప్పు
- దేశంలోని అనేక రాష్ట్రాలకు ఐఎండీ కీలక వాతావరణ హెచ్చరిక
- అస్సాం నుంచి దక్షిణ రాష్ట్రాల వరకు భారీ వర్షాల సూచన
- ఉత్తర, తూర్పు, దక్షిణ భారతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
IMD Weather Alert : దేశవ్యాప్తంగా రుతుపవనాలు బలపడటంతో భారీ వర్షాలు పెరగనున్నాయి. ఈశాన్య భారతం నుంచి ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో వరదలు, నీటి ముంపు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అత్యధిక వర్షాలు ఎక్కడంటే? :
ప్రస్తుతం అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఉత్తర భారత్లో రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో 24 గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Also : Weather Alert : ఏపీ, తెలంగాణలో వాతావరణంలో భారీ మార్పులు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగుల హెచ్చరిక!
తూర్పు భారతదేశంలో బీహార్, జార్ఖండ్, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒడిశా, సిక్కిం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
దక్షిణ, పశ్చిమ ప్రాంతాలకు అలర్ట్ :
మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తోంది. కేరళ, తీర కర్ణాటక, ప్రాంతీయంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా వర్షపాతం మరింత పెరిగే అవకాశముందని వెల్లడించింది.
రుతుపవనాల ప్రభావం ఎందుకంటే? :
రుతుపవన ద్రోణికి పలు వాతావరణ ఆవర్తనాలే కారణమని భారత వాతావరణ శాఖ తెలిపింది. అనూప్గఢ్ నుంచి ఢిల్లీ, షాజహాన్పూర్, బస్తీ మీదుగా నాగాలాండ్ వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. అలాగే, బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, కర్ణాటక ప్రాంతాల్లో తేమను అధికంగా ఉండటంతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదు కానుందని పేర్కొంది.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగనుంది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.













