- బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కీలక మార్పులు.. సామాన్య భక్తులకు భారీ ఊరట
- శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? సెప్టెంబర్ 13–23 మధ్య ఇవి గుర్తుంచుకోండి
- గరుడ సేవకు భారీ రద్దీ అంచనా.. తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులు ఈ పది రోజుల వ్యవధిలో దర్శన ఏర్పాట్లను తప్పక గమనించాలి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగనున్నందున టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 13 నుంచి 23వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో పాటు పలు ప్రివిలేజ్డ్ (Tirumala) దర్శనాలకు కూడా అవకాశం ఉండదని తెలిపింది. ఈ నిర్ణయం సామాన్య భక్తులకు ఎక్కువగా దర్శన అవకాశం కల్పించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.

బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఇప్పటికే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సెప్టెంబర్ 15న సాయంత్రం 6.21 గంటల నుంచి 6.35 గంటల మధ్య ధ్వజారోహణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి అనంతరం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
సామాన్య భక్తుల దర్శనానికి అదనపు సమయం
వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఇతర ప్రివిలేజ్డ్ దర్శనాలతో పాటు శ్రీవాణి టికెట్లను (Tirumala) కూడా రద్దు చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ మార్పుల ద్వారా ప్రతిరోజూ సుమారు 3 గంటల సమయం ఆదా కానుంది. ఆ సమయాన్ని సామాన్య భక్తుల దర్శనానికి వినియోగించనున్నారు. దీంతో క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గే అవకాశం ఉంది.

తిరుమలలో రోజుకు 80 వేల మందికి శ్రీవారి దర్శన అవకాశం కల్పిస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు కేటాయించే గదులను కూడా సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని 7600 గదులతో పాటు వివిధ మఠాల్లోని 60 శాతం గదులను టీటీడీ ఆధీనంలోకి తీసుకుంది.
గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఉచిత అన్నప్రసాదాలు
సెప్టెంబర్ 19న జరగనున్న గరుడ సేవకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ అదనపు ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా సిద్ధంగా ఉంచారు. గ్యాలరీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక అన్నప్రసాదాలు అందించనున్నారు.
పులిహోర, సాంబారన్నం, బిస్కెట్లు, బాదంపాలు, మజ్జిగ, జ్యూసులు, టీ, కాఫీ తదితరాలతో ప్రత్యేక ఫుడ్ మెనూను సిద్ధం చేశారు. బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం తూర్పు, పశ్చిమ, ఉత్తర, ఈశాన్య మూలల్లో స్వామివారి వాహనాన్ని నిలిపి దర్శనం కల్పించనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తిరుమలకు వెళ్లే భక్తులు ఈ మార్పులను ముందుగానే గమనించుకోవడం అవసరం.













