- హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్..
- త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్లు..మెట్రోలో నెలవారీ పాస్లకు గ్రీన్ సిగ్నల్..
- విద్యార్థులు, ఉద్యోగుల ప్రయాణ ఖర్చు తగ్గనున్నదా?
- హైదరాబాద్ ప్రయాణికులకు ఖర్చు తగ్గే అవకాశం
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్.. మీరు ప్రతిరోజూ మెట్రోలో ప్రయాణిస్తుంటారా? ఇకపై విద్యార్థులు, ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ కలగనుంది. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు కొత్త పాస్లు రాబోతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) మెట్రోలో నెలవారీ (మంత్లీ), 3 నెలల (క్వార్టర్లీ) పాస్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఎక్కువగా మెట్రోలో వెళ్లేవారికి భారీగా ఖర్చు తగ్గనుంది. టికెట్ల కొనుగోలు అవసరం కూడా తగ్గనుంది.
ఆర్టీసీ తరహాలో మెట్రో పాస్లు :
మెట్రో ప్రయాణికుల సంఖ్యను పెంచడంతో పాటు ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో భావిస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులకు ఆర్థికంగా ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పాలక మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలోని పాస్ల విధానాన్ని అధ్యయనం చేయడంతో పాటు మెట్రోకు అవసరమైన మోడల్ను అందించే దిశగా అధికారులు రెడీ అవుతున్నారు.
కొత్త మెట్రో పాస్లతో భారీ లాభం :
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు సగటున 4.70 లక్షల నుంచి 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ సంఖ్య దాదాపు స్థిరంగానే కొనసాగుతోంది. ప్రత్యేకించి పండుగలు, వారాంతాల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతోంది.
ఇప్పటికే, తెలంగాణ ఆర్టీసీలో 7 రకాల పాస్లు అందుబాటులో ఉన్నాయి. వేలాది మంది ఈ పాసులను వాడుతున్నారు. ఇప్పుడు మెట్రోలో కూడా మంత్లీ పాస్లు అందుబాటులోకి రానున్నాయి. లక్షన్నర మందికిపైగా ప్రయాణికులు బెనిఫిట్ పొందనున్నారు.
దాంతో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గడంతో ట్రాఫిక్ రద్దీ కూడా భారీగా తగ్గనుంది. పెరుగుతున్న రద్దీతో అదనపు మెట్రో కోచ్లను అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్ మెట్రో అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం.













