Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

KPHB Indiramma Houses : పేదలకు గుడ్‌న్యూస్.. KPHBలో 480 ఇందిరమ్మ ఇళ్లు.. రూ.5 లక్షల సబ్సిడీ.. ఆగస్టు 15లోగా అప్లై చేయండి

KPHB Indiramma Houses : KPHB ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి నేడు భూమిపూజ చేయనున్నారు. 480 ఫ్లాట్లు, రూ.5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ, అర్హతలు, దరఖాస్తు గడువు, పూర్తి వివరాలు ఇవే.

By Ramesh Babu

Published on: August 13, 2026 8:18 AM

Updated on: August 13, 2026 8:18 AM

KPHB Indiramma Houses

---Advertisement---

  • ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు నేడు సీఎం రేవంత్ భూమిపూజ
  • పేదల సొంతింటి కలకు అడుగు.. KPHBలో హైరైజ్ టవర్స్
  • నేడు టవర్స్‌కు సీఎం రేవంత్ భూమిపూజ.. 480 ఫ్లాట్లు
  • రూ.5 లక్షల సబ్సిడీ.. ఆగస్టు 15లోగా దరఖాస్తు చేయండి

KPHB Indiramma Houses : హైదరాబాద్‌లో సొంత ఇల్లు కావాలనే కలతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నగరంలో అందుబాటులో ఉన్న భూమి తక్కువగా ఉండటం, స్థలాల ధరలు భారీగా పెరిగిపోవడంతో పేదలకు ప్రత్యేకంగా బహుళ అంతస్తుల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ప్రాజెక్టుకు గురువారం లాంఛనంగా శ్రీకారం చుట్టనుంది.

హైదరాబాద్‌ కోర్ అర్బన్ రీజియన్‌ (CURE) పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా కూకట్‌పల్లి (KPHB)లో నిర్మించనున్న హైరైజ్ టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా భూమిపూజ చేయనున్నారు. నగరంలోనే, ప్రధాన నివాస ప్రాంతాలకు సమీపంలో పేదలకు ఇళ్లు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారు.

CURE పరిధిలో 12 వేల ఫ్లాట్లు.. తొలి దశలో 7,340 ఇళ్లు

హైదరాబాద్ నగరంలో మొత్తం ఒక లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా కోర్ అర్బన్ రీజియన్‌ (CURE) పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా 12,000 ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు.

మొదటి విడతలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 18 ప్రాంతాల్లో 7,340 ఫ్లాట్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ తొలి విడత పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.807.40 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

Read Also : Jr NTR Shoulder Surgery : జూనియర్ ఎన్టీఆర్‌కు భుజం సర్జరీ.. ఆగస్టు 12న కిమ్స్‌లో శస్త్రచికిత్స

లబ్ధిదారులకు ఇళ్లు మాత్రమే కాకుండా వారి జీవనోపాధికి కూడా ఇబ్బంది లేకుండా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల, నగరంలోని ప్రధాన నివాస ప్రాంతాల్లోనే ఈ ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వాల సమయంలో నగరానికి చాలా దూరంగా ఇళ్లను నిర్మించడంతో లబ్ధిదారులు అక్కడికి వెళ్లి నివసించలేకపోయిన పరిస్థితులు ఉన్నాయని, అలాంటి సమస్య మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్లు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది. పేదలకు ఇల్లు ఇచ్చిన తర్వాత వారి ఉపాధి అవకాశాలు కూడా దూరం కాకూడదనే ఉద్దేశంతోనే నగర పరిధిలో ఈ టవర్స్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

KPHBలో 480 ఫ్లాట్లు.. ఒక్కో టవర్‌లో 120 ఇళ్లు :

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీ సమీపంలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో కలిసి సమీక్షించారు.

KPHB ప్రాంతంలో మొత్తం 4 హైరైజ్ టవర్లను నిర్మించనున్నారు. ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్మాణాలకు అంచనా వ్యయం రూ.43.20 కోట్లుగా నిర్ణయించారు. ప్రతి ఫ్లోర్‌లో 12 ఫ్లాట్లు ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు.

ఇళ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది బోనాల పండుగ నాటికి నిర్మాణాలను పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా.. స్థలం విలువ ప్రభుత్వానిదే
KPHB ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో నిర్మించే ఒక్కో ఫ్లాట్‌ను ఆధునిక సౌకర్యాలతో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 528 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో నిర్మించనున్నారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి సుమారు రూ.11 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షలను సబ్సిడీగా భరిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫ్లాట్ నిర్మాణానికి అవసరమైన స్థలం విలువను పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది.

ఎవరు అర్హులు? దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు?

సంవత్సరానికి రూ.6 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే CURE పరిధిలో ఇప్పటికే సొంత ఇల్లు లేదా సొంత స్థలం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు.ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 15 వరకు గడువు ఉంది. అర్హత ఉన్న వారు మీసేవ కేంద్రాల ద్వారా లేదా మీసేవ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు సమయంలో రూ.100 రుసుము చెల్లించాలి. అదనంగా టోకెన్ అడ్వాన్స్‌ (EMD) కింద రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో అభ్యర్థికి ఇల్లు కేటాయించకపోతే ఈ రూ.10,000 మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ ఇల్లు వస్తే ఆ మొత్తాన్ని లబ్ధిదారుడు చెల్లించాల్సిన వాటాలో జమ చేస్తారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యానికి అవకాశం లేకుండా లాటరీ లేదా లక్కీడిప్ విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Read Also : AP Nethanna Scheme : ఏపీలో నేతన్నలకు గుడ్ న్యూస్.. రూ.25 వేలు అందని వారికి మరో ఛాన్స్.. వారం రోజుల్లో జమ!

నేడు ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌లో నివసిస్తున్న వలస కూలీలు, ఆటో కార్మికులు, చిన్నతరహా ఉద్యోగులు, ఇతర అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల సాకారమయ్యే అవకాశం ఉంది.

ఇల్లు అందించడంతో పాటు నగరానికి దూరంగా కాకుండా ప్రధాన ప్రాంతాల్లోనే నివాసం కల్పించడం ద్వారా లబ్ధిదారులు తమ ఉపాధికి కూడా ఇబ్బంది లేకుండా జీవించగలరన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ నేపథ్యంలో KPHBలో ప్రారంభమవుతున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ప్రాజెక్టుపై నగరవాసుల్లో ఆసక్తి నెలకొంది.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.