AP Govt Scheme : ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్లో చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలిచే కొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.‘నేతన్న సేవలో’ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రతి ఏడాది ఇదే విధంగా రూ.25 వేల సాయం అందించేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శుక్రవారం (ఆగస్టు 7) చీరాల నియోజకవర్గంలోని కొత్తపేటలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు, వారి వృత్తికి ఎదురవుతున్న ఇబ్బందులు, ఉత్పత్తి-మార్కెటింగ్ అంశాలను సీఎం స్వయంగా తెలుసుకున్నారు.
కొత్తపేటలో చేనేత యూనిట్కు సీఎం :
‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభించిన అనంతరం చంద్రబాబు కొత్తపేటలోని ఓ చేనేత మగ్గం యూనిట్ను(AP Govt Scheme) సందర్శించారు. యూనిట్ యజమాని బండారు బాలసుబ్రహ్మణ్యం సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం మగ్గాల వద్ద పనిచేస్తున్న కార్మికులతో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు.
కుప్పడం పట్టు చీరలకు ఉన్న ప్రత్యేకతతో పాటు తరతరాలుగా కొనసాగుతున్న చేనేత నైపుణ్యం, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితుల గురించి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కుప్పడం పట్టు చీరలకువన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు వచ్చిందని చేనేత కుటుంబాలు సీఎంకు వివరించాయి.
జీఐ ట్యాగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కుప్పడం పట్టు చీరల అమ్మకాలు సుమారు30 శాతం పెరిగినట్లు తెలిపారు. గత ఏడాది చీరాలలో తయారైన కుప్పడం పట్టు చీరలతో పాటు అత్యుత్తమ వృత్తి నైపుణ్యానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు రావడం తమకు గర్వకారణమని చెప్పారు.
రూ.25 వేల సాయంతో భారీ చేయూత :
చేనేత వృత్తి ద్వారా కుటుంబాలను ఎలా పోషించుకుంటున్నారు? ఉత్పత్తి ఖర్చులు ఎంత? మార్కెటింగ్, అమ్మకాల పరిస్థితి ఎలా ఉంది? వంటి అంశాలను సీఎం కార్మికులతో చర్చించారు. వర్క్షాప్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను కూడా వారు వివరించారు.
కంచి బోర్డర్ చీరలు తయారు చేసే బత్తా ధనుంజయరావుతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన కుటుంబ పరిస్థితులు, చేనేత వృత్తి ద్వారా వచ్చే ఆదాయం, ఉత్పత్తికి అయ్యే వ్యయం, మార్కెటింగ్ విధానం, విక్రయాల గురించి వివరాలు తెలుసుకున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న200 యూనిట్ల ఉచిత విద్యుత్ చేనేత యూనిట్లకు ఎంతో ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు. తాజాగా అందుతున్న రూ.25 వేల ఆర్థిక సాయం కూడా తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని వివరించారు. అనంతరం బండారు బాలసుబ్రహ్మణ్యంతో కలిసి వర్క్షాప్ తొలి అంతస్తును చంద్రబాబు పరిశీలించారు.
భవనాన్ని మరింత విస్తరించి అదనపు మగ్గాలను ఏర్పాటు చేయాలనే ప్రణాళికను బాలసుబ్రహ్మణ్యం సీఎంకు వివరించారు. దీనివల్ల మరింత మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని చెప్పారు. కోవిడ్ సమయంలో నిలిచిపోయిన విస్తరణ పనులను తిరిగి ప్రారంభించినట్లు కూడా ఆయన ముఖ్యమంత్రికి తెలిపారు.
AP Govt Scheme : కార్మికుల ఫోన్లలోకి డబ్బుల మెసేజ్ :
వర్క్షాప్లో పనిచేస్తున్న ఇతర చేనేత కార్మికులతోనూ చంద్రబాబు మాట్లాడారు. ఈ క్రమంలో బొడ్డు అరుణ అనే మహిళ మగ్గంపై చీరను నేస్తున్న విధానాన్ని సీఎం ఆసక్తిగా పరిశీలించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.25 వేల సాయం తమకు అందిందని చేనేత కార్మికులు సీఎంకు తెలిపారు. తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు మొబైల్ ఫోన్లకు వచ్చిన షార్ట్ మెసేజ్లను కూడా సీఎంకు చూపించారు.
చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందడంతో పాటు ప్రభుత్వం నుంచి లభిస్తున్న ఇతర సహకారం తమ వృత్తికి భరోసా ఇస్తోందని కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడం, ఈ వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.













