హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్ లో బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఆంజనేయ స్వామి శోభాయాత్ర గౌలిగూడలోని రాంమందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు జరగనుందని వెల్లడించారు. శోభాయాత్ర ఏర్పాట్లను సీవీ ఆనంద్ పరిశీలించారు.
వీర హనుమాన్ విజయ యాత్ర ద్విచక్ర వాహన ర్యాలీ రూట్ మ్యాప్ను సంబంధిత పోలీసు అధికారులను, నిర్వాహకులను సీపీ అడిగి తెలుసుకున్నారు. భజరంగ్ దళ్, వీహెచ్పీ నాయకులతో కలిసి తాడ్బండ్ వరకు చేరుకుని యాత్ర ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. అంతకు ముందు సీపీతో పాటు నగర జాయింట్ సీపీ రమేష్ రెడ్డి, డీసీపీ సతీష్, ఏసీపీ దేవేందర్, సీఐలు రవీందర్ రెడ్డి, సుబ్బిరామి రెడ్డి, భిక్షపతి రాంమందిర్లో పూజలు నిర్వహించారు.