Congress Party : దేశంలో మోడీ హవా ఎప్పుడైతే మొదలైందో నాటి నుంచి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ దిగజారుతూ వచ్చింది. అందుకు చాలా మంది పొలిటికల్ అనలిస్టులు ఒక్కో వాదన వినిపిస్తూ వచ్చారు. సరైన వ్యుహాలు లేవని, బలమైన అధ్యక్షుడు లేరని, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని, సొంత పార్టీ కుమ్ములాటలు, ముసలి నాయకత్వం ఇలా అనేక కారణాలు వినిపిస్తున్నాయి.
ఆనాడు మహాభారతంలో కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ పతనానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడిచాయి. ఇప్పుడిప్పుడే మోడీ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. దీనిని క్యాష్ చేసుకోవాల్సిన కాంగ్రెస్ సీనియర్ నేతలు.. సొంత పార్టీని విమర్శించే పనిలో నిమగ్నమయ్యారు.
మొన్నటికి మొన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కు 300 స్థానాలు రావని కుండబద్దలు కొట్టారు. తాజాగా ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ శశిథరూర్ కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపై నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో తెలివి తక్కువ పని చేసిందని ఒక్కసారిగా థరూర్ బాంబు పేల్చారు. అయితే, కేంద్రంలో NDA కూటమికి తర్వాత UPA మాత్రమే అందరికీ గుర్తొస్తుంది. అయితే, ఈ సారి యూపీఏ కూటమి కాకుండా కొత్త కూటమి ఏర్పాటు దిశగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. అందుకోసం NCP పార్టీ అధినేత శరద్ పవార్ను కలిసి చర్చలు సాగించారు.
ఈ క్రమంలోనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీనా అదెక్కడుంది..? యూపీఏ కూటమా అదేక్కడుంది? అంటూ సంచలన కామెంట్స్ చేశారు. మమత వ్యాఖ్యలను యూపీఏ కూటమిలో మెంబర్ అయిన శరద్ పవార్ కూడా ఖండించలేదు.దీనిని బట్టి జాతీయ కాంగ్రెస్ పార్టీకి బీజేపీని, నరేంద్రమోడీని ఢీకొట్టే సత్తా లేదని దీదీ కుండబద్దలు గొట్టింది. అందుకే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు మమతా గ్రౌండ్ వర్క్ చేస్తున్నదని జాతీయ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది.
అయితే, మమత విషయంపై స్పందించిన థరూర్.. గతంలో మమతకు కాంగ్రెస్ మద్దతుగా నిలవలేదని, అందుకు ఇప్పుడు ఆమె హస్తం పార్టీని నమ్మడం లేదన్నారు. అయితే, భవిష్యత్లో మమత కాంగ్రెస్తో పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ను పెంచడానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన సీనియర్లు పార్టీ పరువుతీసి మరింత నష్టం చేకూరుస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
Read Also : Telangana Party : జాతీయ కాంగ్రెస్లోకి విలీనం కానున్న మరో పార్టీ..?