గత కొంత కాలంగా సూర్యుడి భగ భగలతో అల్లాడిపోతున్న భాగ్యనగర వాసులకు ఒక్క సారిగా చిరు జల్లులతో ఉపశమనం లభించింది. హైదరాబాద్లో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో నగరవాసులకు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించింది. నగరంలోని సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, షాపూర్నగర్, బహదూర్పల్లి, కొంపల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షం పడింది.
వర్షం పడడంతో వేసవి తాపం నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగినట్లైంది. రాష్ట్రంలోని అక్కడక్కడ రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే వికారాబాద్ జిల్లా తాండూర్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజలకు వేడి నుంచి కాస్త ఉపశమనం లభించినా.. చేతికొచ్చే ముందు వానలు పడటం వల్ల పంటలు ఏమైపోతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.