Chandrababu Naidu : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కారు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా ఈ విషయంపై స్పందించారు. జగన్ ప్రభుత్వం తీరుని చంద్రబాబు తప్పుపట్టారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి ఆదేశాలున్నా ఏకపక్షంగా విభజన చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి నెలకొందన్నారు. మంత్రిర్గంలో చర్చించకుండా హడావుడిగా రాత్రికి రాత్రి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రతి అంశంపైనా రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని చంద్రబాబు అన్నారు. ఈ సంధర్భంగా టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ లో సమావేశం అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు నేతలు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు నేతలు.
క్యాసినో వ్యవహారం, ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియని హడావుడిగా తెరపైకి తెచ్చారని నేతలు చంద్రబాబు దగ్గర అభిప్రాయపడ్డారు. వాస్తవానికి. కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీలోనే వ్యతిరేకత వస్తోందన్నారు చంద్రబాబు.

ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా టీడీపీ మాత్రం స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని నేతలకు సూచించారు చంద్రబాబు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే మనమెందుకు వ్యతిరేకిస్తాం అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ను ఎవరు గౌరవించినా స్వాగతిస్తామన్నారు.
ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికి చెందిన నేత మాత్రమే కాదని … ఆయనకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఎయిర్ పోర్టుకు నాడు ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొలగించినా, తాము మాత్రం కడప జిల్లాకు వైఎస్ పేరు పెట్టినప్పుడు వ్యతిరేకించలేదని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ ద్వంద విధానాలు ఉండవని తేల్చి చెప్పారు చంద్రబాబు.
Read Also : AP New Districts : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం… ఏవంటే ?