Huzurabad Bypoll Results 2021 : హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలో నిలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఓడించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. మండల స్థాయి టీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులతో ముచ్చటించారు. ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టును హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.
సంక్షేమ రాగం ఎత్తుకుని టీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేసింది. మండలానికో మంత్రి.. గ్రామానికో ఎమ్మెల్యే అన్న రీతిన దాదాపుగా నెలల పాటు హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల జాతర సాగింది. మద్యం ఏరులై పారింది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు ఈటల రాజేందర్ ఓటమి చూడాలని అనుకున్నారు.
ఈటల కచ్చితంగా ఓడిపోతారని అనుకున్నారు. కానీ, వారి అంచనాలు తారుమారు అయ్యాయి. ఈటల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 23,865 ఓట్ల భారీ మెజారిటీతో ఈటల రాజేందర్ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తంగా 24వేల ఓట్ల భారీ మెజార్టీతో టీఆర్ఎస్పై విజయకేతనం ఎగురవేశారు.
గతంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా అసెంబ్లీలో కనిపించిన ఈటల రాజేందర్, ఈ సారి ప్రతిపక్ష హోదాలో ఎమ్మెల్యేగా కనిపించనున్నారు. మొత్తంగా బక్క పలుచటి ఈటల రాజేందర్ అధికార పార్టీని ఎదిరించే ధిక్కార స్వరంగా ముందుకు సాగుతారని పలువురు అనుకుంటున్నారు. ఈటల గెలుపుతో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ను ఎదిరించే వ్యక్తులు ఎక్కువ మంది బయటకు వస్తారని పలువురు అంచనా వేస్తున్నారు.
హుజురాబాద్ నియెజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆరు సార్లు గెలుపొందిన ఈటల రాజేందర్ .. ఈ ఉప ఎన్నికతో ఏడో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇకపోతే ఈ ఉప ఎన్నిక సందర్భంగా అప్పట్లో ఉద్యమ కాలంలో మిత్రులుగా ఉన్న హరీశ్రావు, ఈటల రాజేందర్ ప్రత్యర్థులుగా మారారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. అయితే, ఈటల రాజేందర్ గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ ఇంకా పెరిగే చాన్సెస్ ఉంటాయని పలువురు అంటున్నారు.
Read Also : Pawan Kalyan : బీజేపీకి బీపీ తెప్పిస్తున్న పవన్.. టైం చూసి రంగంలోకి..!