October 5, 2024

Crime News : వరకట్న వేధింపులకు భరించలేక 5 నెలల గర్భిణీ బలి…

1 min read
dowry

Dowry

Crime News : కాలం మారుతూనే ఉంటుంది తప్ప మహిళలపై అఘాయిత్యాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంటున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరో ఒకరిపై నిత్యం దాడులు జరగడం చూస్తూనే ఉంటున్నాం. అలానే మృగాళ్ల కర్కశత్వానికి అభాగ్యులైన మహిళకు నెలకొరుగుతూనే ఉంటున్నారు. ఇలాంటి ఘటన ఇప్పుడు తాజాగా మళ్ళీ చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా పెడనలో చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఇంట్లోనే ఉరి వేసుకుంది ఆ అభాగ్యురాలు. మృతురాలు ఐదు నెలల గర్భవతి కావడంతో విశద ఛాయలు ఆకాశాన్ని అంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుసుమలక్ష్మి అనే మహిళ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమె ఇప్పుడు ఐదు నెలల గర్భవతి. అయితే కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరకట్నం కోసం కుసుమలక్ష్మిని వేధిస్తున్నారు. కాగా కట్నం కోసం వేధిస్తున్నారని తల్లికి ఫోన్‌ చేసి బాధితురాలు వాపోయింది.

అయినా వరకట్న వేధింపులు ఆగకపోవడంతో ఆ బాధలు తాళలేక ఐదు నెలల గర్భవతి అయిన కుసుమలక్ష్మి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే కూతురును చూసేందుకు ఇంటికి వెళ్లేసరికి కూతురు విగతజీవిగా కనిపించడంతో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించిన గుడ్లవల్లేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని మహిళా నాయకులు కోరుతున్నారు.