Court Judgement : సినిమాల్లో మాత్రమే కోర్టు సీన్లు అంటే కామెడీగా ఉంటాయి కానీ నిజ జీవితంలో అందుకు ఛాన్స్ లేదు. మున్సిఫ్ నుంచి సుప్రీం దాకా అన్ని స్థాయిల కోర్టు ల్లోనూ డిసిప్లిన్ అమలవుతుంటుంది. జడ్జిగారు వస్తున్నారంటేనే కోర్టు ఆవరణంతా అలెర్టయిపోయి విచారణ సాగుతున్నంత సేపూ జాగ్రతగా ఉంటారు. కోర్టుల్లో లాయర్లు, కక్షిదారులు, సాక్షులు, సాధారణ ప్రజలు, మీడియా ప్రతినిధులు ఎలా నడుచుకోవాలనేదానిపై కచ్చితమైన ప్రోటోకాల్స్ ఉన్నాయి.
పోలీసులైతే అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందే. మరి అలాంటిది ఓ పోలీసాయన ఏకంగా విచారణ జరుగుతున్న సమయంలోనే సమ్మగా కూల్ డ్రింక్ లాగిస్తే జడ్జిగారు అంత సులువుగా ఎలా వదిలేస్తారు? వెంటనే శిక్ష వేసేస్తారిలా… గుజరాత్ హైకోర్టు వర్చువల్ విచారణలో మంగళవారం (ఫిబ్రవరి 15న) ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసులో ఇరు పక్షాల లాయర్లు వాడీవేడిగా వాదోపవాదాలు వినిపిస్తుండగా, చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ బెంచ్ శ్రద్ధగా ఆలకించింది. అదే కేసుకు సంబంధించి ఇన్ స్పెక్టర్ రాథోడ్ కూడా వర్చువల్ గానే విచారణకు హాజరయ్యాడు.
అవతల వాదనలు జరుగుతోంటే, ఈ పోలీసాయన చల్లగా శీతలపానీయాన్ని సేవించాడు. ఆ దృశ్యం కాస్తా చీఫ్ జస్టిస్ కంటపడింది. అంతే పోలీస్ ఇన్ స్పెక్టర్ తీరుపై జడ్జిగారు అసహనాన్ని వెలిబుచ్చారు. ప్రభుత్వ అధికారి అయి ఉండీ కోర్టు విచారణలో ఎలా నడుచుకోవాలో చెప్పాలా? అంటూ సున్నితంగా మందలించారు. ఆ తప్పుకు శిక్షగా బార్ అసోసియేషన్ కు ఓ వంద కూల్ డ్రిక్ టిన్నులు పంపిణీ చేయాలని ఆదేశించారు జడ్జివర్యులు. 100 కూల్ డ్రిక్స్ పంపిణీ చేయని పక్షంలో క్రమశిక్షణా చర్యలూ తప్పవన్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.