Kishan Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా రైల్వే ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని ఆ లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదని లేఖలో పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపుతుందని టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2014 – 15 లో 250 కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ 2021- 22లో 2420 కోట్లకు చేరిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
స్టేట్ గవర్నమెంట్ భరించాల్సిన వ్యయాన్ని తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులను త్వరితగతిన పూర్తి చేయాలని కిషన్రెడ్డి కోరారు. మోడీ హాయంలో రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు 9 రెట్ల అధిక కేటాయింపులు జరిగాయని గుర్తు చేశారు.
మనోహరాబాద్ – కొత్తపల్లి రైలు మార్గం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల వాటా పెండింగ్లో ఉందని తన లేఖలో వెల్లడించారు. 342 హెక్టార్ల భూమి రైల్వేకు అప్పగించాల్సి ఉందని… అది ఇంత వరకు జరగలేదని మండిపడ్డారు. అక్కన్నపేట – మెదక్ రైలుమార్గంలో 31కోట్ల నిధులు, 1 హెక్టారు భూమిని అప్పగించాల్సి ఉందన్నారు.
54 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరైనప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి సరైన సహకారం లేదన్నారు. ఇక ఎంఎంటిఎస్ ఫేజ్ టూ ప్రాజెక్ట్లో రాష్ట్ర ప్రభుత్వం 760 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉండగా… కేవలం రూ. 129 కోట్లు మాత్రమే జమ చేసిందన్నారు. కృష్ణా నుంచి వికారాబాద్, కరీంనగర్ నుంచి హసన్పర్తి, బోధన్ నుంచి లాతూర్ కొత్త రైల్వే లైన్ మూడు ప్రాజెక్టుల సర్వే పూర్తయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ వాటాపై ధృవీకరణ ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులను లేక్కలతో సహా సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Read Also : Lord Shiva Worship : శివారాధన చేస్తే శనిదోష సమస్యలకు స్వస్తి…