Pawan Kalyan : దివికేగిన గాన కోకిల లతా మంగేష్కర్… సినీ సంగీతానికి తీరని లోటన్న పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan : ఎన్నో ఏళ్ల పాటు ఇండియన్‌ సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఆ మధుర గానం నేడు దివికేగింది. ఎంతో మంది అభిమానులను విషాదంలో నింపి లతా మంగేష్కర్‌ నింగికేగారు. అయితే ఆమె గొంతు నుంచి జాలువారిన మధుర గానాలు శాశ్వతంగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. భాషతో సంబంధం లేకుండా లతాను అభిమానిస్తుంటారు. లతాకు తెలుగులోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే తెలుగులో లతా చాలా తక్కువ సంఖ్యలో పాటలు పాడారు. తన మొత్తం కెరీర్‌లో లతా కేవలం మూడు అంటే మూడు పాటలు మాత్రమే స్ట్రెయిట్‌ తెలుగు మూవీస్‌లో పాడారు.

లతాజీ మృతి పై ప్రముఖ సిని నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో గానకోకిల లతా మంగేష్కర్ అస్తమయం బాధాకరమని ఆయన అన్నారు. లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారనే విషయం తీవ్ర ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికి తీరని లోట ని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. తాను లతాజీ అనారోగ్యం నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు అని తెలుసుకొని స్వస్థత చేకూరింది అనుకొన్నానని.. అయితే ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందన్నారు.

లతాజీ పాటకు భాషాబేధం లేదు. ఆ గళం నుంచి వచ్చిన ప్రతి గీతం సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేసింది… వేలాది గీతాలు ఆలపించిన లతాజీ స్వరం దైవదత్తం అనిపిస్తుందంటూ తనకు లతా మంగేష్కర్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆమె తెలుగులో కేవలం రెండు పాటలే పాడినా అవి మరచిపోలేనివి. .. నిదురపోరా తమ్ముడా…, తెల్ల చీరకు… పాటలు శ్రోతలను మెప్పించాయని ఇందుకు లతాజీ గానమే కారణమని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. దైవభక్తి మెండుగా కలిగిన లతాజీకి సద్గతులు ప్రాప్తించాలని… ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు పవన్ కళ్యాణ్. పవన్ తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు లతా జీ మృతికి సంతాపం తెలియజేశారు.