Krishnam Raju: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం రాధేశ్యామ్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపుతోందని టాక్. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడీ మరీ అద్భుతమైన వసూళ్లు సాధించిందంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్లోనూ భారీగానే వసూళ్లను రాబట్టిందని సమాచారం.
ఈ సినిమాలో హస్తసాముద్రికా నిపుణుడు విక్రమాదిత్య పాత్రలో నటించిన ప్రభాస్కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? కొద్ది రోజుల్లోనే చనిపోతాడనుకున్న విక్రమాదిత్య కోసం ప్రేరణ ఎలాంటి శిక్ష విధించుకుంటుంది అన్న ఆసక్తి కర పరిణామాల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందనే ఈ సినిమా స్టోరీ. కాగా దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఓ కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. అందులో పరమహంస అనే పాత్రను పోషించడంతో ఆయనకు పలువురి నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఇంతకుముందు బిల్లా, రెబల్ సినిమాల్లో నటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే కృష్ణంరాజు కేవలం రాధేశ్యామ్ తెలుగు వర్షన్కి మాత్రమే పరిచయం కాగా, మిగతా వర్షన్లలో సత్యరాజ్ కనిపించినట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కృష్ణంరాజు పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా, తాజాగా హీరో ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక నుంచి ప్రభాస్ వచ్చే ఏడాదికి రెండు సినిమాలు చేస్తారని కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఈ సినిమాను బాహుబలితో పోల్చి చూడవద్దన్న ఆయన, మనవూరి పాండవులు లాంటి చిత్రాల్లో ప్రభాస్ నటిస్తే చూడాలని ఉందని ఆయన ఆకాంక్షించారు. ఇక ప్రభాస్ పెళ్లి అయి, అతనికి పిల్లలు పుడితే తన చేతులతో ఆడించాలని ఆతృతగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.