Crime News : ఈజీగా డబ్బు సంపాదించడం కోసం కొందరు వక్ర మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. కాగా అలాంటి అన్యాయాలు జరగకుండా… అక్రమార్కుల తాట తీయాల్సిన పోలిసే ఈ కేసులో ట్రాక్ తప్పాడు. డబ్బు కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకొని అతను రాంగ్ రూట్ లోకి వెళ్ళాడు. ఈ కారణంగా పలువురికి బేడీలు వేయాల్సిన ఆ వ్యక్తి… ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఆ స్టోరీ ఎంతో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే…
అరుదైన వన్యప్రాణి సంపదను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు ఆ నిందితుడు. నక్షత్ర తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని నెల్లూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకు చెందిన సెల్వ కుమార్ ఏకంగా… 250 తాబేళ్లను స్మగ్లింగ్ చేయాలని చూశాడు. అందుకు అతడు ఆర్టీసీ బస్సును ఎంచుకున్నాడు. బస్సు అయితే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. కనిగిరి ఆర్టీసీ బస్సులో తమిళనాడుకు నక్షత్ర తాబేళ్లు తీసుకెళ్లుతుండగా… బీవీ పాలెం వద్ద నిర్వహించిన తనిఖీల్లో దొరికిపోయాడు.
పట్టుబడిన నిందితుడు చెన్నై ఆవడి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చెన్నైలో ఎక్వేరియం నడుపుతున్న నిందితుడు… బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వివిధ రకాల వన్యప్రాణులను ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు. వీటి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని… వీటిని చెన్నై నుండి మలేషియాకు తరలించి ఎనిమిది నుండి పది లక్షల రూపాయలు మధ్య అమ్మకాలు సాగిస్తున్నట్లు వెల్లడైందని అధికారులు తెలియజేశారు. స్వాధీనం చేసుకున్న నక్షత్ర తాబేళ్లను వెంకటగిరి అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తెలిపారు.
Read Also : Health Tips : పెరుగు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయని తెలుసా… ఏంటంటే ?