నేను ఇండస్ట్రీ పెద్ద కాదు.. నాకు అవ్వాలని కూడా లేదు.. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు.. కానీ బాధ్యతగా ఉంటా.. ఇది ఈ మధ్య ఓ ప్రెస్ మీట్ లో భాగంగా చిరంజీవి మాట్లాడిన మాటలు. ఈయన మాటల్లో తనకు ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఇష్టం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.కానీ పెద్దరికం గా ఉంటూ పనులు చేయడానికి నాకేం అభ్యంతరం లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు చిరంజీవి
వెనకుండి భజన చేయకపోయినా పర్లేదు కానీ.. అనవసరంగా తన పేరు మధ్యలోకి లాగి చిరంజీవి ఇండస్ట్రీ పెద్దలా ఉండి అలా చేశాడు.. ఇలాగ చేశాడనే చెడ్డపేరు తనకు అవసరం లేదనుకుంటున్నాడు మెగాస్టార్. ఆయన మాటల్లో అందరికీ అర్థమైంది కూడా ఇదే. అయితే టికెట్స్ విషయంతో పాటు ఇండస్ట్రీలో మరి కొన్ని సమస్యల గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలతో చర్చించడానికి చిరు ఎప్పుడూ ముందే ఉంటున్నారు. తెలంగాణలో టికెట్స్ రేట్ ఇష్యు గురించి ప్రభుత్వానికి లేఖ రాసింది ముందుగా చిరంజీవే. ఆయన స్పందించిన తర్వాతే మిగిలిన వాళ్ళు అడిగారు.అలాగే ఏపీలో నెలకొన్న పరిస్థితుల గురించి కూడా ఆయన ముఖ్యమంత్రి జగన్ తో చర్చించడానికి సిద్ధమయ్యాడు. సినిమా పరిశ్రమ పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ చిరంజీవి,జగన్ ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
సినిమా ఇండస్ట్రీ గురించి వాస్తవ పరిస్థితులను చిరంజీవి,ముఖ్యమంత్రి జగన్ కు వివరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది చిరంజీవి పెద్దరికం కోసం చేయడం లేదని.. ఏదైనా సాయం చేయాల్సి వచ్చినప్పుడు సినీ కార్మికులకు అండగా ఉంటానని మాటిచ్చినందుకే తన బాధ్యత నెరవేరుస్తున్నాడని చిరు వర్గం చెబుతున్న మాట. ఒకవేళ ఈ సమస్యను గానీ చిరంజీవి పరిష్కరిస్తే.. అనధికారంగా చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అయిపోవడం ఖాయం. మరోవైపు మోహన్ బాబు రాసిన బహిరంగ లేఖ ఈ మద్యే సంచలనం రేపింది. ముఖ్యంగా ఎవరికి వాళ్ళు పట్టనట్టుగా ఉండటం మంచిది కాదని మోహన్ బాబు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి వెళ్లి జగన్ ను కలుస్తుండడం ఆసక్తికరంగా మారింది.