Pawan Kalyan : రాష్ట్రంలో 32 మత్స్యకార కులాలు, ఉపకులాలు ఉన్నాయని, 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. దోపిడీ చేసే చట్టాలను ఉల్లంఘించాల్సిందేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. నర్సాపురంలో ఆదివారం జనసేన నేతృత్వంలో మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో జనసేనకు ప్రజలు అండగా ఉండాలని, లేకపోతే నేను ఏమీ చేయలేనన్నారు. ప్రజల కోసం తాను చావడానికి సిద్ధమని తెలిపారు. రాష్ట్రంలో రహదారులు బాగాలేవని, .. ప్రయాణంలో అలసిపోయానన్నారు. రహదారులపై ప్రయాణం చేసి చాలా ఇబ్బందులు పడ్డానని, ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా ఎంతో ఆలోచించి మాట్లాడతానని స్పష్టం చేశారు. వైసీపీ నేతల బెదిరింపులకు జనసైనికులు భయపడరని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో ఇలాగే హింసిస్తే తెగించి రోడ్డుపై నిలబడతానన్నారు.
మరబోట్లు రాకముందు సముద్రతీరం అంతా మత్స్యకారులదేనని, మరబోట్లు వచ్చాక మత్స్యకారులకు అనేక సమస్యలు వచ్చాయయన్నారు. లేని సమస్యను సృష్టించడంలో వైకాపా నేతలు ఉద్దండులన్నారు. సమస్య పరిష్కారం పేరుతో అనేక ఇబ్బందులు పెడతారని, చనిపోయిన మత్స్యకారులకు మూడేళ్లలో 64 మందికే పరిహారం ఇచ్చారన్నారు. అమలు కాని హామీలు ఎందుకు ఇస్తున్నారని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. మత్స్యకార గ్రామాల్లో కనీస వసతులు లేవని, ప్రజా సమస్యలు తీర్చాలని వైసీపీకి అధికారం ఇచ్చారని స్పష్టం చేశారు. మటన్, చికెన్ కొట్లు నడపడానికి అధికారం ఇవ్వలేదన్నారు. ప్రజాస్వామ్య సమాజంలో ఫ్యూడల్ భావాలు ఉంటే ఎలా? అని చట్టాలు పాటించేలా ముందు వైసీపీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు.