Red Sandals Smuggling : ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తమిళనాడు రిజిష్ట్రేషన్ కలిగిన కారు ఈరోజు తెల్లవారు జామున 5 గంటల సమయంలో చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం, పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారి కన్నలి గ్రామం ఎస్టీ కాలనీ వద్ద అదుపు తప్పి ఒక ఇంట్లోకి దూసుకువెళ్లింది. దీంతో ఆ ఇల్లు ధ్వంసం అయ్యింది.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అతి వేగం కారణంగా కారు బోల్తా కొట్టిందని తెలుస్తోంది. ఈ ఘటనతో ఎర్ర చందనం తరలిస్తున్న స్మగ్లర్లు కారు వదిలి పెట్టి పరారయ్యారు. అనంతరం స్థానికులు ఘటన జరిగిన ప్రదేశానికి చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు ఆ కారులో ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ధ్వంసం అయిన ఇంటిలో నివసిస్తున్న భర్త భాస్కరయ్య (62) భార్య రత్నమ్మ (49) లకు తీవ్ర గాయాలయ్యాయి.
స్ధానికులు వారిని సమీపంలోని శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో నుంచి 8 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇంత కాలం వరకు కరోనా కారణంగా లాక్ డౌన్ లు, కేకింగ్ లతో సైలెంట్ గా ఉన్న స్మగ్లరు మళ్ళీ తమ బిజినెస్ ను స్టార్ట్ చేసే పనిలో పడినట్లు ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తే అర్దం అవుతుంది.