Crime News: సిద్దిపేట జిల్లా వీరాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సంబురాల్లో భాగంగా గ్రామంలోని మహిళలంతా కలిసి బతుకమ్మ ఆడుతున్నారు. వారితో పాటు గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ కూడా బతుకమ్మ ఆడుతోంది. ఆమె వెనకాల నిలుచున్న భర్త రాడ్డుతో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మృతురాలు స్వప్న భర్త ఎల్లారెడ్డి ఆమెపై కోపంతోనే ఇలా చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
గతంలో స్వప్న అక్కతో ఎల్లారెడ్డికి పెళ్లి చేయగా.. వివాహం జరిగిన నెలకే ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ తర్వాత ఆమె చెల్లె స్వప్నను ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ పెళ్లైన ఆరేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో భార్య అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి దగ్గరై 14 ఏళ్లుగా అతడితో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై కోపం పెంచుకున్న భర్త ఎల్లారెడ్డి ఆమెను చంపేశాడు.