- మహిళలు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ప్రమాద బీమా
- మరణం సంభవిస్తే రూ. 10 లక్షల వరకు బీమా సౌకర్యం
- ప్రమాద బీమా, లోన్ బీమా పథకాలతో ఆర్థిక భరోసా
- ఇప్పటివరకు 231 క్లెయిమ్స్ పరిష్కారం,
- లబ్ధిదారుల కుటుంబాలకు మొత్తం రూ. 23.1 కోట్లు
DWCRA Women : డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. లోన్ తీసుకున్న ఫ్యామిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. మహిళలు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ప్రమాద బీమాను అందిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం అందించే ప్రమాద బీమా, లోన్ బీమా పథకాలు ఆర్థిక భరోసా అందిస్తున్నాయని (DWCRA Women) పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పేర్కొన్నారు. కుటుంబాలకు భద్రత కల్పించడంతో పాటు మహిళల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు.
ఆ లోన్ భారం ఇతరులపై పడేది :
డ్వాక్రాలో చేరిన మహిళా సభ్యురాలికి ఒకవేళ మరణం సంభవిస్తే ఆమె తీసుకున్న లోన్ కుటుంబానికి భారంగా మారుతుంది. నిరుపేద కుటుంబాలు ఆ లోన్ చెల్లించలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అదే సంఘంలో ఇతర సభ్యులు ఆ లోన్ చెల్లించాల్సి వచ్చేదని మంత్రి సీతక్క వివరించారు.
కొందరు డ్వాక్రా సభ్యులు ఆ మొత్తాన్ని చెల్లించని పక్షంలో బ్యాంకులు ఆయా సంఘాలను బ్లాక్ లిస్ట్లో పెడతాయి. ఫలితంగా కొత్త లోన్లు ఆమోదం పొందే పరిస్థితి ఉండదు. దాంతో డ్వాక్రా సంఘాలు అక్కడితోనే ఆగిపోయేవని ఆమె పేర్కొన్నారు.
DWCRA Women : లోన్ ఇన్సూరెన్స్ పాలసీ :
ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లోన్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. మహిళలకు జీవిత బీమా రక్షణ, బ్యాంకు రుణాలపై సైతం బీమా వర్తించేలా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
ఒకవేళ ఈ విధానం అమలులోకి వస్తే బ్యాంకు రుణం పొందిన మహిళా సభ్యురాలు మరణించిన పక్షంలో ఆ రుణాన్ని ప్రభుత్వమే చెల్లించే విధానం అమల్లోకి రానుంది. అంటే.. ప్రతీ డ్వాక్రా మహిళకు రూ.10 లక్షల బీమా సౌకర్యం అందుబాటులోకి రానుంది. తద్వారా ఈ బీమా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకుకు చెల్లిస్తుంది అనమాట.
Read Also : Rythu Bharosa 2026 : రైతు భరోసా డబ్బులు పడేది ఈరోజే? ఒకే విడతలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు?
రూ. 10 లక్షల వరకు బీమా సౌకర్యం :
తద్వారా ఫ్యామిలీలపై పడే ఆర్థిక భారం పూర్తిగా తగ్గుతుందని మంత్రి అన్నారు. ప్రమాద బీమా పథకం కింద ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి మరణం సంభవిస్తే రూ. 10 లక్షల వరకు బీమా సౌకర్యం అందించనున్నట్టు తెలిపారు. 2024లో పథకం ప్రారంభం కాగా ఇప్పటివరకు 231 క్లెయిమ్స్ పరిష్కరించగా మొత్తం రూ. 23.1 కోట్లు లబ్ధిదారుల కుటుంబాలకు అందించామన్నారు.
లోన్ బీమా పథకం కింద మహిళా సంఘ సభ్యులు బ్యాంకుల్లో తీసుకున్న బకాయిలపై రూ. 2 లక్షల వరకు గరిష్టంగా రక్షణ కల్పిస్తున్నామన్నారు. 2,993 క్లెయిమ్స్ ప్రాసెస్ చేసి మొత్తం రూ. 246 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఈ పేమెంట్ల వల్ల బ్యాంకులపై నమ్మకం పెరిగిందన్నారు.
ఈ 2 పథకాలు అమల్లోకి వచ్చాక మహిళా సంఘాలు మళ్లీ యాక్టివ్ అయ్యారని, కొత్త సభ్యులు సంఘాలలో చేరుతున్నారని మంత్రి వివరించారు. బీమా భరోసాతో పాటు చిన్నమొత్తంలో వ్యాపారాలను పెంచుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. చాలామంది మహిళల్లో రుణ భయం చాలావరకు తగ్గిందన్నారు.

