- ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం
- అతి త్వరలో పాన్ కార్డు కొత్త రూల్స్ అమల్లోకి
- డ్రాఫ్ట్ ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026 ఎప్పటినుంచంటే?
- భారీ మొత్తాల లావాదేవీలను ట్రాక్ చేయడమే లక్ష్యం
New Income Tax Draft Rules : సాధారణ పౌరులు, పన్నుచెల్లింపుదారులకు బిగ్ న్యూస్.. ఇకపై అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి కానుంది. పాన్ కార్డు కొత్త రూల్స్ సంబంధించి డ్రాఫ్ట్ ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026లో ప్రతిపాదించారు. ఈ కొత్త మార్పులు సాధారణ ప్రజల రోజువారీ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడొచ్చు.
అంతేకాదు.. బ్యాంకు అకౌంట్లలో పెద్ద మొత్తంలో క్యాష్ డిపాజిట్లు చేసినా లేదా డబ్బులు తీసినా, ఫిక్స్డ్ డిపాజిట్లు, పెట్టుబడులు, కార్లు, బైకుల కొనుగోలు, ఇల్లు, స్థలం వంటి ఆస్తుల కొనుగోలు, హోటళ్లలో భారీ బిల్లుల చెల్లింపులు వంటి లావాదేవీల కోసం కూడా ఇకపై పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
ప్రస్తుత టాక్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో పారదర్శకంగా మార్చడమే కాకుండా భారీ మొత్తాల లావాదేవీలను ట్రాక్ చేయడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ముసాయిదాను సమర్పించింది. ఫిబ్రవరి 22 వరకు దీనిపై ఎవరైనా తమ అభిప్రాయాన్ని తెలియజేయొచ్చు. మీ అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ తుది నియమాలను అమలు చేస్తుంది.
మోటారు వాహన లావాదేవీలివే :
ప్రస్తుతం, స్కూటర్లు, బైక్లు మినహా అన్ని వాహనాల లావాదేవీలకు పాన్ కార్డు అవసరం. ఈ లావాదేవీలకు ఎలాంటి పరిమితి లేదు. రూ. 5 లక్షల కన్నా ఎక్కువ విలువైన వాహనాల లావాదేవీలకు పాన్ కార్డు అవసరమని డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను నియమాలు పేర్కొన్నాయి. ఇందులో టూవీలర్ వాహనాలు కూడా ఉన్నాయి. ఈ రూల్ ట్రాక్టర్లకు వర్తించదు.
హోటల్, రెస్టారెంట్ బిల్లులు :
ప్రస్తుతం, హోటళ్ళు లేదా రెస్టారెంట్లకు ఒకేసారి రూ. 50వేల కన్నా ఎక్కువ క్యాష్ పేమెంట్లకు పాన్ కార్డు అవసరం. ఈ పరిమితిని రూ. లక్షకు పెంచుతామని ముసాయిదా నియమాలు పేర్కొన్నాయి. అంటే.. రూ. లక్ష కన్నా ఎక్కువ లావాదేవీలకు పాన్ కార్డు అవసరం అవుతుంది.
జీవిత బీమా ప్రీమియం :
ప్రస్తుతం, జీవిత బీమా పాలసీకి వార్షిక ప్రీమియం రూ. 50వేలు దాటితే పాన్ కార్డు అవసరం. అకౌంట్ ఆధారిత సంబంధాలన్నింటికి ఇప్పుడు పాన్ అవసరమని ముసాయిదా నియమాలు చెబుతున్నాయి. జీవిత బీమా ప్రీమియంలకు సంబంధించిన లావాదేవీలు కవర్ అవుతాయి.
ఆస్తి లావాదేవీలకు పాన్ కార్డు :
ప్రస్తుతం, రూ. 10 లక్షలు దాటిన ఆస్తి లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి. ముసాయిదా నియమాలు ఈ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచుతాయి. తక్కువ వాల్యూ కలిగిన ఆస్తి లావాదేవీలకు పాన్ కార్డు అవసరం ఉండదు.
బ్యాంక్, పోస్టాఫీస్ నుంచి విత్డ్రా :
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షలకు మించి క్యాష్ విత్డ్రాలను రిపోర్టు చేయడం అవసరం. ముసాయిదా నియమాలలో ఈ పరిమితిని రూ. 10 లక్షలకు తగ్గించారు. పన్ను ఎగవేతను అరికట్టేందుకు కేంద్రం ఈ దిశగా చర్య తీసుకుంది.

